డాజోన్‌ విస్తరణ బాట

  • రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌, మే 24(బిజినెస్‌ డెస్క్‌): విదేశీ సంస్థలను ఆకట్టుకోవడంలో తెలంగాణ దూసుకుపోతున్నది. ఇప్పటికే అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి బ్రిటన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ డాజోన్‌ కూడా చేరింది. హైదరాబాద్‌లో అరబిందో గెలాక్సీ మాల్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థకు పోలాండ్‌, లీడ్స్‌, లండన్‌, అమ్‌స్టార్‌డమ్‌లో డెవలప్‌ సెంటర్‌ను నెలకొల్పిన సంస్థ..భారత్‌లో తన తొలి సెంటర్‌ ఇదే కావడం విశేషం. స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ టెక్నాలజీపై మరింత దృష్టి సారించడంలో భాగంగా ఈ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు డాజోన్‌ గ్రూపు సీఈవో షా సెగెవ్‌ తెలిపారు.

900 మంది కూర్చోవడానికి వీలుండే ఈ సెంటర్‌లో ప్రస్తుతం 350 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది ఉద్యోగుల సంఖ్యను 2,500కి పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. వచ్చే ఐదేండ్లలో హైదరాబాద్‌ సెంటర్‌ను మరింత అభివృద్ధి పరుచడానికి వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ భవిష్యత్తులో టెక్నికల్‌ హబ్‌గా మారనున్నదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆటలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలో ఇంటర్‌యాక్టివ్‌ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్‌ రూపకల్పనలో హైదరాబాద్‌ సెంటర్‌ కీలక పాత్ర పోషిస్తున్నద విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా సంస్థకు 3 వేల మంది సిబ్బంది ఉన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటుకు కారణాలు..

  • హైదరాబాద్‌ చుట్టు పలు అంతర్జాతీయ యూనివర్సిటీలు ఉండటం
  • ట్రాఫిక్‌ సమస్య చాలా తక్కువగా ఉండటం
  • మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం
  • తక్కువ వేతనాలకు ఐటీ ఉద్యోగులు లభించడం..

కేటీఆర్‌కు ధన్యవాదాలు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు, ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు అని కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సందీప్‌ టీకూ తెలిపారు. ఇటీవల లండన్‌ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌తో సమావేశమై, భవిష్యత్తు టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటునకు సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలిపారు. బ్రిటన్‌తోపాటు ఇతర దేశాల్లో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ లైసెన్స్‌ కూడా సంస్థ పొందింది.

2023-05-24T20:50:08Z dg43tfdfdgfd